తిరుమల ఆలయానికి ఏయే గ్రామాలను దేవదేయంగా రాజులు లేదా సంస్థానాధీశులు ఇస్తారో, ఆయా గ్రామాల్ని, మాన్యాల్ని శ్రీనివాసుడి ‘సుదర్శనచక్రం’ కాపాడుతుండేది.
అదెలా జరిగిందంటే…
•••
ప్రాచీన కాలంనుంచీ – అంటే మనకు తిరుమల ఆలయచరిత్ర శాసనాల ద్వారా తెలుస్తున్నప్పటి నుంచీ చూస్తే, ఆలయానికి వస్తున్న ఆదాయం పైన, ఆలయానికి దేవదేయాలుగా దానాలు చేసిన భూములపైన, గ్రామాలపైన ఆయాకాలపు రాజులు – వారికి కట్టవలసిన సుంకాలు, పన్నులలో మినహాయింపు ఇచ్చే సంప్రదాయం ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 1801 సంవత్సరంలో ఆలయం ఈస్టిండియా కంపెనీవారి యాజమాన్యంలోకి వచ్చే వరకూ అదే కొనసాగింది (ఆతర్వాత ఏమయిందో కంపెనీ విషయాలు చర్చించినప్పుడు చూద్దాం).
మాలిక్కాఫరు దండయాత్రల వరకూ తిరుమల ఆలయం యాదవరాజుల పాలనలో ఉండేది. ఆలయ అవసరాలకు, నైవేద్యాలకు నిధులు చాలకపోతే, యాదవరాజులు ఆలయ కార్యక్రమాల్లో లోపం లేకుండా నిధులు సమకూర్చేవారు.
మొదట ముస్లిం దండయాత్రలతో రాజకీయ కల్లోలం దక్షిణభారతంలో మొదలై, మళ్లీ విజయనగర సామ్రాజ్యం స్థిరపడేవరకూ (అంటే విజయనగర స్థాపన జరిగిన తర్వాత కూడా 5/6 దశాబ్దాల వరకూ) అనిశ్చిత పరిస్థితులు సాగాయి. అంటే- ఇంచుమించుగా 1350 నుంచి 1568 వరకూ ఈ పరిస్థితులు కొనసాగాయని చెప్పుకోవచ్చు.
అది తెలుసుకొనేముందు ఆ కాలంలో గ్రామాలలో వ్యవసాయ పరిస్థితి, రైతులు పన్ను ఎంత కట్టాలి, గ్రామం నుండి ఎటువంటి పన్నులు వసూలు చేసేవారు, దేవదేయంగా భూములు గాని, గ్రామాలు గాని ఆలయానికి ఇస్తే- పంటలో రాజుకెంత, రైతుకెంత, ఆలయానికెంత భాగం వెళ్లేది… అన్నవి ఆసక్తికరమైన విషయాలు.
ఆ కాలంలో నాలుగురకాల వారికి భూముల మీద హక్కులుండేవి.
1. భండారవాడ : ఇవి రాజుగారి భూములు. వాటి ఆదాయాలు రాజుగారి ఖజానాకు నేరుగా వెళ్తాయి.
2. అమరం : నాయకులు లేదా పాలెగాళ్ల చేతుల్లో ఉన్న భూములు. వీరి అధీనంలో ఉన్న భూములు, గ్రామాలపై వచ్చే ఆదాయాన్ని ఈ నాయకులు తీసుకొని, రాజు తరఫున, ఈ ఆదాయంతో కొంత సైన్యాన్ని ఏర్పాటుచేసి, రాజు అవసరాలను బట్టి, సహాయానికి పంపాలి. వీటిలో రకరకాలున్నాయి. పూర్తి ఆదాయం సైన్యం మీద ఖర్చు పెట్టడం లేదా కొంత సైన్యానికి, కొంత నాయకునికి, కొంత రాజుకు ఇలా… భాగాలుగా ఖర్చులు పెట్టడం చేసేవాళ్లు. ముఖ్యంగా వచ్చే ఆదాయం వెచ్చించడంలో తయారుగా ఉంచాల్సిన సైనికుల సంఖ్యను బట్టి మార్పులుంటాయి.
3. ఎలిమోసనరీ లేదా దేవదేయాలు : ఆలయాలకు దానాలుగా ఇచ్చిన భూములు, గ్రామాలు, బ్రాహ్మణులకు ఈనాములుగా ఇచ్చినవి, వేద పాఠశాలలకు, శాస్త్రపాఠశాలలకు ఇచ్చినవి, మఠాలకు, సన్న్యాసుల అధీనంలోని భూములు.
4. రైతుల అధీనంలోని భూములు : దీనిమీద చాలా చర్చ ఉంది. భూమి ఎవరిదైనా భూమి మీద వచ్చే పంటను ఆ రోజుల్లో రెండు భాగాలు చేసేవారు. ‘మేలవరం’ అంటే భూమి హక్కుదారు భాగం, ‘కుడివరం’ అంటే భూమి సాగుచేసే రైతు భాగం.
రాజుకు వెళ్లినా, నాయకునికి వెళ్లినా, ఆలయానికి వెళ్లినా, వేద పాఠశాలలకు వెళ్లినా, మఠాధిపతులకు వెళ్లినా, భూమి సొంతదారులకు వెళ్లినా, అది ‘మేలవరం’ భాగం మాత్రమే. ఎటువంటి భూమిఖాతా అయినా, దున్ని పండించే వాడి ‘కుడివరం’ భాగంలో మార్పు లేదు. అది ఆ పండించిన రైతుకు చెందాల్సిందే. ‘మేలవరం’ భాగంలోనే భూకామందులకు, రాజుకు, ఆలయాలకు భాగాలు. మిగతావారి విషయంలో ఎలావున్నా తిరుమల ఆలయానికి సంబంధించినంతవరకూ రాజులు దానాలిచ్చినా, ఇతర దాతలిచ్చినా, వాటిని దేవదేయాలుగా భావించి, మేలవరం భాగమంతా గ్రామాధికారులే వసూళ్లు చేసి, ఆలయానికి అందచేసే సంప్రదాయం ఉండేది.
గ్రామాలనుండి, ఈ ‘మేలవరం’ భాగంలోని పన్నులే కాక, ఇతర పన్నులు కూడా వసూలు చేసేవారు. బంగారం కొనుగోలు – అమ్మకాల మీద పన్ను, ధాన్యం కొనుగోలు-అమ్మకాలపై పన్ను, భూమి అమ్మకం/కొనుగోలు పన్ను, ఉచితంగా సేవలందించడానికి పన్ను, జంతువుల మీద పన్ను, రాకపోకల పన్ను, వర్తకదారులమీద పన్ను, నూనె తీసేవారి మీద పన్ను, బట్టలు నేసేవారి మీద పన్ను, తోటలు పెంపకంపై పన్ను, చేపల చెరువులపై పన్ను, బందెలదొడ్ల పన్ను – తప్పిపోయిన జంతువులు… ఇలా రకరకాల పన్నులు- కొన్ని సందర్భాలలో ‘యువరాజు పెంపకానికి’, ‘రాజమాత ఖర్చులకు’ విడిగా పన్నులు వసూలు చేశారు. రాజుగారిని శత్రువులు ఎత్తుకుపోతే చెరవిడిపించడానికి శత్రువులకు కట్టడానికి గ్రామానికింత అని వసూలు చేసే పన్ను…!
తిరుమల ఆలయం విషయంలో గ్రామాన్ని దేవదేయంగా రాజు ఇచ్చినా, ఇతర దాతలు ఇచ్చినా ఆ గ్రామం విషయంలో పై చెప్పిన పన్నులన్నీ రద్దయినట్లే. అంటే ఆ గ్రామం నుండి వచ్చే అన్నిరకాల ఆదాయాలూ ఆలయానికి చెందుతాయి.
గ్రామాన్ని ఏ దాతైనా దానంగా ఇవ్వాలనుకుంటే, ఆ గ్రామంపై రాజుకు వచ్చే ఆదాయం, ఇతరులకు వచ్చే ఆదాయం, అంతా కలుపుకొని, ఆ గ్రామానికి ఒక ధర నిర్ణయించి, అంత ధనం కట్టినవారికి, దేవదేయం చేయిస్తారు. అందులో కొంత భూకామందులకు వారి భాగం, ఇతరులకు వారి భాగం, మిగతాది రాజుకు వెళతాయి. ఈ మార్పు వలన భూమిని నిజంగా సాగు చేసేవారి భాగంలో ఎటువంటి మార్పు లేదు.
‘తిరుపతి’ గ్రామాన్ని దేవదేయంగా తిరువేంకటనాథ యాదవరాయరు (అప్పటి సామంతరాజు) చేసినప్పుడు, చెక్కించిన శిలాశాసనంలో ఈ విషయాలు చాలా విపులంగా ఉన్నాయి.
ఇటువంటి దేవదేయాలు – గ్రామాల పరిధిలో కాని, లేదా ఆలయ అధికారుల సమక్షంలో కాని జరగవచ్చు. గ్రామాల పరిధిలో జరిగితే, ఇచ్చిన దేవదేయాల గురించి ఆలయ స్థానత్తారులకు (అధికారులకు) గ్రామాధికారులు తెలియజేస్తారు.
తిరుమల ఆలయ భూముల్ని, దేవదేయంగా వచ్చిన గ్రామాల్ని కాపాడుకోవడం ఒక పెద్ద సమస్య.
అయితే ప్రజలలో దైవభక్తి, పాపభీతి బాగా ఉండటంవల్ల తిరుమల శ్రీనివాసుడి భూముల, గ్రామాల సరిహద్దుల్ని సూచిస్తూ సర్వే రాళ్లన్నింటిమీద సుదర్శనచక్రాన్ని చెక్కించేవారు. ప్రజలు ఆ సుదర్శనచక్రాన్ని చూస్తూనే ‘‘దేవుడి మాన్యం’’ అనుకుంటూ భక్తితో పక్కకి తప్పుకునేవారు. అలా ‘సుదర్శనచక్రం’ ఆ స్వామివారి దేవదేయాన్ని కాపాడుతూ ఉండేది.
•••
PVRK ప్రసాద్
Note : నా ఆధ్యాత్మిక జీవితాన్ని పూర్తిగా మార్చివేసిన T.T.D E.O. పోస్ట్, ఊహకందని శ్రీనివాసుని లీలల సమాహారం – నాహం కర్తా హరిః కర్తా
More Stories
సింగరకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం — శాసనాలు, చరిత్ర, భక్తి పరంపర, తరంగ సంప్రదాయం
శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి దేవాలయం, వికారాబాద్
శ్రీకూర్మం దేవాలయము