
– రామకృష్ణ వెల్లంకి
శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం వికారాబాదు సమీపంలో ఉంది. దీనిని అనంతగిరి అనంతపద్మనాభ స్వామి దేవాలయం అని అంటరు. అత్యంత ప్రాచీన దేవాలయాల్లో ఇది ఒకటి. హైదరాబాద్కి 75 కిలో మీటర్ల దూరంలో, వికారాబాద్ పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతగిరి కొండల్లో వెలసిన దేవాలయ దైవమే శ్రీ అనంత పద్మనాభ స్వామి.
స్కంద పురాణం లోని ఓ ఘట్టం ప్రకారం, ఈ దేవాలయం ద్వాపర యుగంలో “మార్కండేయ” ఋషి నిర్మించాడని ప్రతీతి. ఈ ప్రాంతంలోని ప్రశాంతమైన వాతావరనానికి ఆరర్షితుడైన మార్కండేయ ముని అనంతగిరి కొండలలో యోగ సాధన చేయుటకు సంకల్పిస్తాడు. మార్కండేయ ముని తన యోగ సాధనతో ప్రతి రోజూ అనంతగిరి నుండి కాశీ వెళ్ళి, గంగా నదిలో పవిత్ర స్నానమాచరించేవాడు. ఒక రోజు ఉదయం ప్రాతః కాలంలో ద్వాదశి ప్రవేశించుట వలన ఆయన కాశీకి వెళ్లలేకపోతాడు. శివుడు ఆయన స్వప్నంలో దర్శనమిచ్చి ఆయనకు గంగా జలాన్ని స్నానమాచరించుటకు ఏర్పాట్లు చేస్తాడు. కలియుగ ప్రారంభంలో మహావిష్ణువు మార్కండేయ మహామునికి దర్శనమిచ్చి అతని తపఃఫలముగా సాలగ్రామ రూపంలో అనంతపద్మనాభుడిగా అవతరించాడని చరిత్ర ద్వారా తెలుస్తోంది. అంతటి మహిమాన్విత క్షేత్రం ఈ దేవాలయం.
రాజర్షి ముచికుందుడు అనేక సంవత్సరాల పాటు రాక్షసులతో యుద్ధం చేసి అనంతగిరిలో విశ్రాంతి తీసుకొనుటకు వచ్చి పూర్తి నిద్రలోనికి వెళ్తాడు. ఆయన దేవేంద్రుని ద్వారా “ఎవరు ఆయనకు నిద్రాభంగం కలిగిస్తారో వారు అగ్నికి ఆహుతి అవుతారు” అనే వరాన్ని పొంది యున్నాడు.
కాలయవనుడు అనే రాక్షసుడు ద్వారకా నగరాన్ని చేరుకుని కృష్ణుడు, బలరాములను తీసుకుని అనంతగిరి ప్రాంతానికి వచ్చి ముచికుందునికి నిద్రాభంగం కలిగించి మరణిస్తాడు. పిమ్మట కృష్ణుడు ముచికుందునకు “అనంత పద్మనాభస్వామి” రూపంలో దర్శనమిస్తాడు. శ్రీకృష్ణ బలరామ దేవుళ్లు ప్రత్యక్షం కాగా, ముచుకుందుడు సంతోషించి వారి పాదాలను కడిగి జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు. ముచుకుందుని చేత శ్రీ కృష్ణుడి పాదాలు కడిగిన జలమే జీవనదిగా మారిందని కథనం. అనంతగిరి కొండల్లో పుట్టిన ముచికుందా నది కాలక్రకమేణా మూసీ నదిగా మారింది. అనంతగిరిలో పుట్టి, జిల్లాలో పారుతూ హైదరాబాద్ మీదుగా నల్గొండ జిల్లాలో కృష్ణా నదిలో మూసీ కలుస్తోంది.
ప్రశాంత వాతావరణంలో ప్రకృతి రమణీయత ఉట్టిపడే ఈ ప్రాంతం భక్తులను ఎంతగానో ఆకర్షిస్తోంది. కొండలు, దట్టమైన అడవితో కూడిన ఈ ప్రాంతం భక్తులకు, ప్రకృతి ప్రేమికులకూ కనువిందు చేస్తూ ఉంటుంది. ప్రతీనిత్యం ఇక్కడకు వచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకొని తరిస్తారు. అనంత పద్మనాభ స్వామి దేవాలయం సుమారు సా. శ. 1300 సంవత్సరంలో నిర్మించి ఉండవచ్చని స్థానికులు చెబుతారు. దట్టమైన అడవి, కొండలు, గుహలతో ఋషులు తపస్సు చేసుకోవటానికి అనుకూలంగా ఉండే ఈ ప్రాంతం ఓ తపోభూమి అనడంలో అతిశయోక్తి లేదు..
దేవాలయం పక్కనే ఉన్న భగీరథ గుండంలో స్నానం చేస్తే పాపాలు హరిస్తాయని భక్తుల నమ్మకం. దేవాలయానికి వచ్చే భక్తులు ముందుగా భవనాశిని అని పేరున్న భగీరథ గుండంలో స్నానం ఆచరించి స్వామి వారిని దర్శించుకుంటారు. ఈ భగీరథ గుండంలో స్నానం ఆచరిస్తే కోర్కెలు తీరడమే కాకండా సంతాన ప్రాప్తి కలుగుతుందని ప్రజల నమ్మకం.
ప్రతీ సంవత్సరం రెండు సార్లు ఇక్కడ జాతరను నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో జిల్లా ప్రజలేకాకుండా ఇతర రాష్ట్రాల వారు పెద్ద ఎత్తున పాల్గొంటారు. కార్తీక పౌర్ణమికి రథోత్సవంతో పాటు, 11 రోజుల పాటు జాతరను నిర్వహిస్తారు. ఆషాఢ మాసంలో 5 రోజుల పాటు ఉత్సవాలు జరుపుతారు. ఈ ఉత్సవాలకు జిల్లాకు చెందిన ప్రజలే కాకుండా పరిసర జిల్లాలైన హైదరాబాద్, మహబూబ్నగర్, మెదక్ల నుంచి తరలివస్తారు. ఇక్కడ తరచుగా సినిమా షూటింగ్లు కూడా జరుగుతుంటాయి.
More Stories
శ్రీకూర్మం దేవాలయము
కురవి వీరభద్రస్వామి దేవాలయం
ఒంటిమిట్ట రామాలయం