
– రామకృష్ణ వెల్లంకి
వరాహనేరి వెంకటేశ సుబ్రమణ్యం అయ్యర్ (1881 ఏప్రిల్ 2–1925 జూన్ 3), వి.వి.ఎస్. అయ్యర్ అని పిలుస్తారు. భారతదేశంలో బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడిన తమిళనాడు రాష్టానికి చెందిన భారతీయ విప్లవకారుడు. అతని సమకాలీనులలో సుబ్రమణ్య భారతి, వి.ఒ. చిదంబరం పిళ్ళై వంటి వారు ఉన్నారు. వీరందరూ బ్రిటిష్ వలస ప్రభుత్వానికి వ్యతిరేకంగా విప్లవాత్మక భావాలు కలవారు. అయ్యర్ ఒక తమిళ రచయిత, ఆధునిక తమిళ చిన్న కథలకు పితామహుడిగా భావిస్తారు.
వెంకటేశ సుబ్రమణ్యం అయ్యర్ 1881 ఏప్రిల్ 2న తిరుచ్చిలోని వరాహనేరి శివారులో ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. అయ్యర్ ప్రారంభ విద్యాభ్యాసం తరువాత న్యాయవాద వృత్తిలో చేరి 1902సంవత్సరంలో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి ప్లీడర్ (జూనియర్ లాయర్) పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. ఆ తర్వాత తిరుచ్చి జిల్లా న్యాయస్థానాల్లో ప్లీడర్ గా ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాడు. ఆ తర్వాత అయ్యర్ 1906లో రంగూన్ వెళ్లి జూనియర్ బారిస్టర్ గా ప్రాక్టీస్ ప్రారంభించాడు. రంగూన్ నుండి 1907 సంవత్సరంలో లండన్ కు వెళ్ళి, న్యాయవాది ( బారిస్టర్) కావాలనే లక్ష్యంతో లింకన్స్ ఇన్ లో చేరాడు. లండన్ లో ఉండగా అయ్యర్ కు వినాయక్ దామోదర్ సావర్కర్ అనే భారతీయ విప్లవకారుడితో ఇండియా హౌస్ లో పరిచయం ఏర్పడింది. సావర్కర్ ప్రభావంతో అయ్యర్ భారత స్వాతంత్ర్యం కోసం జరిగిన మిలిటెంట్ పోరాటంలో చురుకైన పాత్ర పోషించడం ప్రారంభించాడు.
అయ్యర్ విప్లవాత్మక వైఖరి వల్ల, 1910లో లండన్, పారిస్ లలో ఒక కుట్రలో పాల్గొన్నట్లు ఆరోపించబడినందుకు అతనిని అరెస్టు చేయడానికి వారెంట్ జారీ చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం యత్నించడంతో, లింకన్స్ ఇన్ కు రాజీనామా చేసి పారిస్ కు పారిపోయాడు. అయ్యర్ రాజకీయ ప్రవాసంలో పారిస్ లో ఉండాలని అనుకున్నా భారతదేశానికి తిరిగి రావడం జరిగింది. 1910 డిసెంబరు 4 అయ్యర్ పాండిచ్చేరికి ముస్లిం వేషంలో వచ్చి, ప్రవాసంలో ఉన్నాడు. అయ్యర్ పది సంవత్సరాలకు పైగా పాండిచ్చేరిలో ఉన్నాడు. పాండిచ్చేరిలో ఉన్నప్పుడు అయ్యర్ తోటి విప్లవకారులు సుబ్రమణ్య భారతి, అరబిందోలతో కలవడం జరిగింది. పాండిచ్చేరిలో తిరునల్వేలి కలెక్టర్ ఆషేను హత్య చేయడానికి అయ్యర్ కుట్ర పన్నాడు. అతని శిష్యులలో ఒకరైన వంఛినాథన్, జనరల్ ఆషేను హత్య చేశాడు. దీనితో వి.వి.ఎస్. అయ్యర్ కు, ఆయన సహచరుడు సుబ్రమణ్య భారతికి విభేదాలు రావడం జరిగింది.
1914 సెప్టెంబరు 22న జర్మన్ క్రూయిజర్ ఎస్.ఎం.ఎస్.ఎమ్డెన్ మద్రాసు ఓడరేవులోకి ప్రవేశించి నగరంపై బాంబు దాడులను చేసింది. పాండిచ్చేరిలో బహిష్కరించిన వారి కార్యకలాపాలే ఇందుకు కారణమని భావించి, బ్రిటిష్ వలస ప్రభుత్వం ఒక కుట్రపన్ని, వి.వి.ఎస్. అయ్యర్ను, ఆయన సహచరులను ఆఫ్రికాకు బహిష్కరించాలని ఫ్రెంచి గవర్నరును కోరింది. ఫ్రెంచి పోలీసులు విప్లవకారులపై అనేక అభియోగాలు మోపారు, కాని వారిని దోషులుగా నిర్ధారించడంలో విఫలమయ్యారు. ఈ కాలంలో అయ్యర్ తిరుక్కురళ్ ను ఆంగ్ల భాషలో అనువదించాడు. అతను దేశం విడిచి వెళ్ళవలసి వస్తే వారసత్వాన్ని విడిచిపెట్టాలని అనుకుంటున్నట్లు తరువాత వెల్లడించాడు. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత అయ్యర్ మద్రాసుకు తిరిగివచ్చి దేశభక్తన్ (పేట్రియాట్) అనే వార్తాపత్రికకు సంపాదకుడిగా పనిచేశాడు. అతను 1921 లో రాజద్రోహం ఆరోపణలపై అరెస్టు చేయబడ్డాడు, తొమ్మిది నెలలు జైలులో గడిపాడు. జైలులో ఉన్నప్పుడు అయ్యర్ ఎ స్టడీ ఆఫ్ కంబ రామాయణ్ అనే పుస్తకాన్ని వ్రాశాడు.
తమిళ సాహిత్యంలో ‘ఆధునిక తమిళ చిన్న కథలకు పితామహుడు ఎవరు?’ అని ప్రశ్న అడిగితే, వ్యక్తుల అభిరుచిని బట్టి కల్కి లేదా పుదుమైప్పితన్ వంటి పేర్లను చెపుతారు. ఆధునిక తమిళ సాహిత్య చరిత్ర చరిత్రలో వారిద్దరితో పాటు వి.వి.ఎస్.అయ్యర్ ని కూడా ఉటంకిస్తారు. సాహిత్యం పట్ల అయ్యర్ అభిరుచి, ప్రేమ ఎ౦త ఉ౦డేదో, స్వాతంత్ర్య సమర౦ సాగుతుండగా, పాండిచ్చేరిలో ప్రవాస౦లో తిరుక్కురళ్ ఆంగ్ల భాషలో అనువాదం చేయడం, వందలాది చిన్న కథలు రాయడంలో వ్యక్తమవుతుంది. బెంగాలీలో రవీంద్రనాథ్ ఠాగూర్ స్వరపరిచిన చిన్న కథల్లో ఒకటైన కబూలీవాలా అదే పేరుతో తమిళంలోకి అనువదించడం జరిగింది. స్వాతంత్ర్య సమరయోధులు, యోధుల జీవితచరిత్రలు రాయడం జరిగింది. ఇటాలియన్ దేశభక్తుడైన గరిబాల్ది జీవితచరిత్రను ఆయన ‘భారతదేశం‘లో ధారావాహికగా రాశారు. అతను గురు గోవింద్ సింగ్ జీవితచరిత్రను కూడా రచన చేశాడు.
అయ్యర్ 1925 జూన్లో పాపనాశం జలపాతంలో మునిగిపోతున్న తన కూతురిని రక్షించే ప్రయత్నంలో మునిగిపోయాడు. ఆయన మృతిపై వినాయక్ దామోదర్ సావర్కర్ ఈ విధంగా నివాళులర్పించారు. “అయ్యర్ నిజానికి శక్తికి మూలస్తంభం, హిందువులకు ఒక ఆరాధ్యుడు,మన నాగరికతలో అత్యంత ఉన్నతమైన ప్రతినిధులలో ఒకరిని కోల్పోయాము. అనుభవాలతో పండి, బాధలతో మెత్తబడ్డాడు. మానవులకు, భగవంతుని సేవకు అంకితమయ్యాడు” అని రాయడం జరిగింది.
More Stories
అల్లూరి సీతారామరాజు బలిదానం
ధీరన్ చిన్నమలై
ఆచార్య బిరుదురాజు రామరాజు