దక్షిణాపథ అధ్యయన సంస్థ, Andhra Mahila Sabha College of Teacher Education సహకారంతో, ఏప్రియల్ 24, 2026 న రాణి రుద్రమదేవి జీవితంపై ఒక ఉపన్యాసాన్ని నిర్వహించింది. ఇది “చరిత్రలో శక్తివంతమైన మహిళలు” అనే ఉపన్యాస పరంపరలో భాగంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో స్వతంత్ర పరిశోధకురాలు డాక్టర్ బిన్నూరి మనోహరి గారు మాట్లాడారు. రాణి రుద్రమదేవి గురించి లభ్యమయ్యే శాసనాల ఆధారంగా ఆమె గొప్పతనాన్ని వివరించారు. చరిత్రలో అనేక మంది రాణులు ఉన్నప్పటికీ, వారిలో చాలామంది అనుకోకుండా సింహాసనం అధిరోహించారనీ, ఇందుకు భిన్నంగా రుద్రమదేవి మాత్రం ముందుగానే శిక్షణ పొంది, అధికారికంగా పట్టాభిషేకం చేయబడి రాజ్యాన్ని స్వతంత్రంగా పాలించిన ప్రత్యేకమైన మహారాణి అని తెలిపారు.

వివిధ శాసనాల్లో ఆమెకు లభించిన గౌరవాన్ని కూడా వివరించారు. కొలనుపాక శాసనంలో “సర్వరాజన్య కీరీట రత్నాలతో నివాళులు అందుకొనె పాదాలు” అని ఉంది. అంటే అది ఇతర రాజులు ఆమెకు గౌరవంగా నమస్కరించేవారని సూచిస్తుంది. అలాగే ఛాయ సోమేశ్వర ఆలయం శాసనంలో ఆమెను “మహా మండలేశ్వర”, “సర్వరాయ మహేశ్వర”, “మున్నురాయ” వంటి బిరుదులతో వర్ణించారు. ఇవి ఆమె గొప్ప పాలనా శక్తిని తెలియజేస్తాయి.
రుద్రమదేవి వ్యూహపటిమ, పరాక్రమం, పరిపాలనా నైపుణ్యం చాలా గొప్పవని డా. మనోహరి గారు చెప్పారు. ఆమె ఓరుగల్లు కోటను నిర్మించి కాకతీయ రాజ్యాన్ని రక్షించినట్లు వివరించారు. ఎనభై ఏళ్ల వయస్సులో కూడా యుద్ధరంగంలో పాల్గొన్నారని, దీనికి చందుపట్ల శాసనం సాక్ష్యమని తెలిపారు. ఆమె దీర్ఘకాలం పాటు విశాలమైన సామ్రాజ్యాన్ని విజయవంతంగా పాలించిన మహారాణి అని డా. మనోహరి గారు పేర్కొన్నారు.
ప్రస్తుత తరానికి రుద్రమదేవి ఒక గొప్ప ఆదర్శమని ఆమె వివరించారు. ముఖ్యంగా యువతులు ఆమె విజయాలను తెలుసుకోవాలని సూచించారు. వ్యక్తి ఎవరు అన్నది కాకుండా, తన బాధ్యతను ఎలా నిర్వహిస్తారన్నదే ముఖ్యమని చెప్పారు. చరిత్రలో మనం నేర్చుకోవాల్సిన గొప్ప దృష్టాంతాలలో రుద్రమదేవి జీవితం ఒకటి అని వివరించారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణవేణి గారు మాట్లాడుతూ, ఇలాంటి ఉపన్యాసాలు నిర్వహించినందుకు దక్షిణాపథ అధ్యయన సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. మంచి పరిశోధన ద్వారా విద్యార్థులుఏ విషయంపైనైనా లోతైన అవగాహన పొందగలరని చెప్పారు.
దక్షిణాపథ అధ్యయన సంస్థ తెలంగాణ విభాగాధిపతి చంద్రమౌళి కళ్యాణ చక్రవర్తి గారు మాట్లాడుతూ, విద్యార్థులు ఏ విషయాన్నైనా సమగ్ర దృష్టితో చూడాలని సూచించారు. ఒకే కోణంలో అధ్యయనం చేయడం సరిపోదని, విషయాన్ని అనేక కోణాల్లో పరిశీలించడం అవసరమని చెప్పారు. భారతీయ సంప్రదాయం గొప్పదనమంతా ఏ విషయాన్నైనా చర్చ, వాదన, ఆలోచనల ద్వారా సమగ్రంగా అర్థం చేసుకోవడమేనని వివరించారు.
చివరగా విద్యార్థులతో జరిగిన ప్రశ్నోత్తర కార్యక్రమంతో ఉపన్యాస కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

More Stories
విద్యారణ్యస్వామి గురించిన ఉపన్యాసము
పండరంగని అద్దంకి పద్యశాసనం – తెలుగుభాషా చరిత్రలో అక్షరజ్యోతి
వనపర్తి సంస్థానంలోని ప్రత్యేక మైన నీటిపారుదల ప్రాజెక్టు