డాక్టర్ తంగెళ్ళ శ్రీదేవి రెడ్డి గారి ముఖపుస్తకం నుండీ సేకరణ
వనంలో వనమై
వనమంతా తానై…
పర్యావరణానికి ప్రాణమిత్రుడు
కోటి మొక్కలు నాటిన ప్రకృతి ప్రేమికుడు
దరిపల్లి రామయ్య
అతడే
ఆకుపచ్చని ముద్ర…వనజీవి రామయ్య…!
బాగా ఎరిగిన వాళ్ళకు చెట్ల రామయ్య..!
▪️వివరాలు
ఖమ్మం జిల్లా ముత్తగూడెం గ్రామానికి చెందిన దరిపల్లి లాలయ్య, పుల్లమ్మ దంపతులకు 1937 ప్రాంతంలో రామయ్య జన్మించాడు. ముత్తగూడెం గ్రామంలోనే ఐదవ తరగతి వరకు చదువుకున్నాడు. తర్వాత వీరి కుటుంబం ముత్తగూడెం నుండి వ్యవసాయం కోసం ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లికి వచ్చి స్థిరపడింది. అట్లా ప్రస్తుతం రెడ్డిపల్లి గ్రామం రామయ్య స్వస్థలం.
కుటుంబ పోషణలో భాగంగా వృత్తి రీత్యా కుండలు చేయడం, పాలు అమ్మడం, మరోవైపు వ్యవసాయం చేయడం, ఇన్ని పనులు ఉన్నప్పటికీ మొక్కలు పెంచే ప్రవృత్తిని రామయ్య ఎన్నడూ నిర్లక్ష్యం చేయలేదు.
కొద్దికాలం క్రితం రెండో కుమారుడు
అనారోగ్యంతో మృతి చెందాడు. శోకం వేటాడినప్పటికీ రామయ్య తన వన యజ్ఞాన్ని మాత్రం వదులుకోలేదు.కొడుకు పేరు మీద మరిన్ని మొక్కలు పెంచాడు.
బాల్యం నుండే రామయ్యకి మొక్కలు పెంచడం ఒక అలవాటు. ఈ అలవాటు క్రమంగా వ్యసనం అయ్యింది. వ్యసనం జీవిత వ్యాపకం అయ్యింది.
చివరకు జీవితమే వనం అయింది.
1970 ప్రాంతంలో మొక్కుల పెంపకానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. ఈ ప్రకారం
ఆ సంవత్సరానికి ప్రాంతాలను ఎంపిక చేసుకోవడం,వేసవిలో విత్తనాలు సేకరించడం, తొలకరి రాగానే విత్తనాలు చల్లడం, చల్లి వదిలి వేయకుండా కొన్ని కొన్ని జాగ్రత్తలతో సంరక్షించడం చేస్తూ వచ్చాడు.
అడవుల వెంబడి, చెరువు కట్టల వెంబడి, బాటల వెంబడి , జాతర జరిగే చోట్లా,దేవాలయాల్లో, పాఠశాలల్లో, ప్రభుత్వ కర్యాలయాల్లో, ప్రస్తుతం రామయ్య పెంచిన మొక్కలు వనమై వృక్షోరక్షతి రక్షితః మాటను ప్రచారం చేస్తున్నాయి
రామయ్య పెంచిన వనాలు బాటసారులకు పశువులకు నీడనిస్తున్నాయి. ఎన్నో పక్షులకు అవాసాన్ని కల్పిస్తున్నాయి.
▪️రామయ్య నిబంధనలు
1 పెండ్లిల్లు గృహప్రవేశాలు వంటి శుభకర్యానికి వెళ్లినా మొక్కలనే బహుమతిగా ఇచ్చేవాడు.
2. తమ ఇంటికి ఎవరు అతిథులు వచ్చినా మొక్కలనే కానకగా ఇచ్చేవాడు.
3.ఆత్మీయులు మిత్రులు ఎవరైనా మరణిస్తే వారి పేరు మీద మొక్కలు నాటేవాడు
4.ఎక్కడ ప్రభుత్వ కార్యక్రమాలు జరిగినా “వృక్షోరక్షతి రక్షిత:” అని రాసివున్న ప్లకార్డులను మెడకు తగిలించుకుని వెళ్లి ప్రచారం చేసేవాడు.
5. రహదారుల వెంబడి , ఖాళీ స్థలాల్లో, జనసంచారం ఉండే ఇతర ప్రాంతాల్లో ప్లకార్డులను తగిలించి వెళ్ళవాడు. . తిరుమల తిరుపతి ఘాట్ రోడ్డులో కూడా ఈ ప్లకార్డులను మనం గమనించవచ్చు. ఈ ప్ల కార్డులు కుండల రూపంలో
చక్రాల రూపంలో బోర్డుల రూపంలో ఉంటాయి.
▪️ప్రకృతి పరిజ్ఞానం
రామయ్యకు ప్రకృతిలోని మొక్కలపై చెట్లపై, వాటి ప్రయోజనాలపై అపారమైన పరిజ్ఞానం ఉండేది. సహజంగా అందరికీ తెలిసిన చెట్ల గురించే కాకుండా
ఎన్నో అటవీ వృక్ష సంపద గురించి, వన మూలికల గురించి , మౌఖిక పాఠాలే చెప్పేవాడు. అట్లా దాదాపుగా వందల చెట్ల గురించిన అవగాహన రామయ్య సొంతం.
▪️పురస్కారాలు – గౌరవాలు
తన జీవితాన్ని పర్యావరణానికి అంకితం చేసిన రామయ్యకు అనేక పురస్కారాలు వరించాయి.
1995లో భారత ప్రభుత్వం నుంచి వనసేవా పురస్కారం.
2005 సెంటర్ఫర్ మీడియా సర్వీసెస్ సంస్థ నుంచి వనమిత్ర పురస్కారం.
2017లో కేంద్ర ప్రభుత్వం నుండి పద్మశ్రీ సత్కారం..
‘యూనివర్సల్ గ్లోబల్ పీస్ ‘ అంతర్జాతీయ సంస్థ నుంచి గౌరవ డాక్టరేట్.
ఖమ్మం రోటరీ క్లబ్ అవార్డు
మొత్తం 3000 లకు పైగా అవార్డులు అందుకున్నాడు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరితహారంలో రామయ్యను బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది
▪️పాఠ్యాంశంగా రామయ్య జీవితం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6వ తరగతి సాంఘిక శాస్త్రంలో వనజీవిగా రామయ్య చేసిన కృషిని
పాఠ్యాంశంగా బోధిస్తున్నది.
మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడి తెలుగు విద్యార్థుల కోసం 9వ తరగతి తెలుగు పుస్తకంలో వనజీవిగా రామయ్య జీవితం ఏ విధంగా ఆదర్శమో పాఠ్యాంశంగా బోధిస్తున్నది.
▪️కుటుంబం – ప్రకృతి ప్రేమ
రామయ్య భార్య జానమ్మ. ఈ దంపతులకు నలుగురు సంతానం. ముగ్గురు కొడుకులు. ఒక కూతురు.
ప్రకృతి మీద తన ప్రేమకు గుర్తుగా తన మనవరాళ్లకు చందనపుష్ప, హరిత లావణ్య. కబంధపుష్ప వనశ్రీ అని చెట్ల పేర్లే పెట్టుకున్నాడు. ఇది అతడి అదృష్టం. ఎందుకంటే… సమాజంలో తమ పిల్లల పేర్లు తామే పెట్టుకుంటామని వాదించే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు.
▪️కాలధర్మం
వనంలో వనమై
వనమంతా తానై…
చివరకు వ్రణమై కొంత కాలంగా అనారోగ్యంతో ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 12 , 2025 న కాలధర్మం పొందారు..
More Stories
రాంజీ గోండు (పుణ్యతిథి, ఏప్రిల్ 9)
యల్లాప్రగడ సుబ్బారావు (జన్మతిథి, జనవరి 12 )
ఆయుర్వేద వ్యాప్తికర్త, వైద్యరత్న పండిత దీవి గోపాలాచార్యులు