
కేరళ రాజధాని నగరం తతిరువనంతపురంలోని పురాతన పాఠశాల, ‘మోడల్ స్కూల్’గా ప్రసిద్ధి చెందిన ప్రభుత్వ మోడల్ హయ్యర్ సెకండరీ, ప్రధాన విద్యాసంస్థలలో ఒకటి. నగరంలోని థైకాడ్ ప్రాంతంలో ఉన్న ఇది 1905లో ‘గవర్నమెంట్ మోడల్ హైస్కూల్’ పేరుతో స్థాపించబడింది. ఈ పాఠశాల తొలి విద్యార్థులలో ఒకరైన 14 ఏళ్ల బాలుడు క్యాంపస్లో “జై హింద్” అని అరవటం ద్వారా, భారతదేశం యొక్క బ్రిటిష్ పాలనను ధిక్కరించి కోలాహలం సృష్టించాడు. ‘వెంకిడి’ అనే మారుపేరుగల అతని అసలు నామం, సి చెంపకరామన్ పిళ్లై. ఆ నినాదంతో భయాందోళనకు గురైన పాఠశాల అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్నస్వామి పిళ్లై అనే హెడ్ కానిస్టేబుల్ ఘటనపై విచారణకు వచ్చారు. ఆ పోలీసు కుమారుడే మన చంపక్ రామన్ పిళ్లై.
చంపక్ రామన్ పిళ్లై సెప్టెంబర్ 15, 1891లో చిననస్వామి పిళ్లై, నాగమ్మాళ్ దంపతులకు ఓ మధ్యతరగతి తమిళ కుటుంబంలో జన్మించారు. చిన్నతనంలో, లోకమాన్య తిలక్ గురించి చదవడం ద్వారా అతను తీవ్రమైన దేశభక్తితో నిండిపోయాడు. 1906లో, అతను త్రివేండ్రంలో పశ్చిమ కనుమల సీతాకోకచిలుకల అధ్యయనంలో నిమగ్నమై ఉన్న బ్రిటీష్ ప్రకృతి శాస్త్రవేత్త సర్ వాల్టర్ స్ట్రిక్ల్యాండ్ను కలుసుకున్నాడు. ఒక సైన్స్ జర్నల్లో ప్రచురితమైన, సాలెపురుగులు వాటి రంగును మార్చగల సామర్థ్యం గురించి, పద్మనాభ పిళ్లై అని, నగరానికి చెందిన 18 ఏళ్ల కుర్రాడి ద్వారా ప్రభావితమైన స్ట్రిక్ల్యాండ్, ఆ యువకుడిని వెతికి యూరప్కు తీసుకెళ్లడానికి ప్రతిపాదించాడు. పద్మనాభ పిళ్లై యొక్క అభ్యర్థన మేరకు లేదా భారతీయ తీరాన్ని ఒంటరిగా విడిచిపెట్టడానికి అతని అయిష్టతను అధిగమించడంలో సహాయపడటానికి, ఈ ప్రకృతి శాస్త్రవేత్త, పొరుగున ఉన్న చెంపకరామన్ పిళ్లైని కూడా తనతో తీసుకెళ్లాడు. ముగ్గురూ కొలంబో వరకు ప్రయాణించినప్పుడు, పద్మనాభ పిళ్లై చలికి చలించి త్రివేండ్రంకు తిరిగి వచ్చారు. 15 సంవత్సరాల చెంపకరామన్ పిళ్లై మాత్రం స్ట్రిక్ల్యాండ్తో కలిసి యూరప్కు వెళ్లారు. అక్కడ అతనిని ఆస్ట్రియాలోని ఒక పాఠశాలలో చేర్పించాడు. అక్కడే అతను తన ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేశాడు.
పిళ్లై తన విద్యను యూరప్లో కొనసాగించాడు. జ్యూరిచ్లో చదువుకున్నాడు. అక్కడ అతను ఇంజనీరింగ్లో డిప్లొమా చేసాడు. తదనంతరం, అతను పబ్లిక్ గవర్నెన్స్ మరియు ఎకనామిక్స్లో పట్టభద్రుడయ్యాడు. అదే సమయంలో పిళ్లై ఓ డజను భాషలలో పరిజ్ఞానాన్ని కూడా సముపార్జించాడు. జులై 1914 లో ప్రారంభమైన మొదటి ప్రపంచ యుద్ధాన్ని, వలసవాదం నుండి భారతదేశం యొక్క స్వాతంత్ర్యం కోసం ఒక అవకాశంగా దృఢంగా, అంకితభావంతో ఉపయోగించుకున్నాడు. యుద్ధం ప్రారంభమైన వెంటనే, పిళ్లై, బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలోని సైనికులకు తిరుగుబాటు చేయమని స్పష్టమైన పిలుపునిచ్చాడు. దీనితో సైనికులు తిరుగుబాటు చేసి, రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలో ఇండియన్ నేషనల్ ఆర్మీ యొక్క పూర్వగామిగా ఉన్న ఇండియన్ నేషనల్ వాలంటీర్ కార్ప్స్ను ఏర్పాటు చేశారు. చంపక్ రామన్ పిళ్లై జ్యూరిచ్లోని రాయబార కార్యాలయాన్ని చేరుకుని, భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి జర్మనీ మద్దతును పొందేందుకు ప్రయత్నించాడు. సెప్టెంబరు 1914 నాటికి, జ్యూరిచ్ ప్రధాన కార్యాలయంగా, తను అధ్యక్షుడిగా, అంతర్జాతీయ భారత అనుకూల కమిటీని ఏర్పాటు చేశాడు. ఈ సంస్థ జర్మన్ మరియు ఆంగ్లంలో ‘ప్రో ఇండియా’ ప్రచురణను ప్రారంభించింది. పిళ్లై ‘జై హింద్’ అనే నినాదాన్ని రూపొందించిన ఘనత కూడా పొందాడు. ఈ నినాదాన్నే, తరువాత కాలంలో, నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క ఇండియన్ నేషనల్ ఆర్మీ తన అధికారిక పలకరింపుగా, నినాదంగా స్వీకరించింది. స్విట్జర్లాండ్ తటస్థ భూభాగం అయినప్పటికీ, విప్లవకారులను నిర్మూలించడానికి ఒక బృందాన్ని పంపడం ద్వారా బ్రిటీష్ ఇంటెలిజెన్స్, పిళ్లై బృందాన్ని అనుసరించింది. విషయాన్ని పసిగట్టిన పిళ్లై, బెర్లిన్కు పారిపోయాడు.
పిళ్లై చొరవతో బెర్లిన్లోని భారతీయ ప్రవాసులు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నాయకురాలు, సరోజినీ నాయుడు యొక్క పెద్ద సోదరుడు వీరేంద్రనాథ్ ఛటోపాధ్యాయ నేతృత్వంలో ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ను స్థాపించారు. పిళ్లై తన ప్రో-ఇండియా గ్రూప్ను ఈ లీగ్తో విలీనం చేశాడు. ఈ లీగ్ లోని ప్రముఖుల్లో, భూపేంద్రనాథ్ దత్తా (స్వామి వివేకానంద సోదరుడు), ఎ రామన్ పిళ్లై, తారకనాథ్ దాస్, మౌలవి బర్కతుల్లా, చంద్రకాంత్ చక్రవర్తి, ప్రభాకర్, బీరేంద్ర సర్కార్, హేరంబ లాల్ గుప్తా మరియు నాను నంబియార్ లు ఉన్నారు. అనంతర కాలంలో చంపకరామన్ పిళ్లైతో పాటు ఐరోపాకు తన ప్రయాణాన్ని విరమించుకున్న పద్మనాభ పిళ్లై కూడా జర్మనీకి వచ్చి, ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ లో చేరారు. సంస్థ సభ్యులలో ఒకరైన, గోట్టింగెన్ విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా ఉన్న రామన్ పిళ్లై మరియు చెంపకరామన్ పిళ్లై, ట్రావెన్కోర్కు చెందినవారు, ఐరోపాలో చదువుకున్నవారు. చెంపకరామన్ పిళ్లై రామన్ పిళ్లైకి వ్రాసిన అనేక లేఖలను ఆయన కుమారుడు, త్రివేండ్రంకు చెందిన రచయిత మరియు సామాజిక కార్యకర్త రోస్కోట్ కృష్ణ పిళ్లై భద్రపరిచారు. చెంపకరమన్ పిళ్లై జర్మనీలో గడిపిన సంఘటనల సంవత్సరాలపై ఈ లేఖలు కొంత వెలుగునిస్తాయి.
పిళ్లై యొక్క ప్రో-ఇండియా గ్రూప్, ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్తో విలీనమైనప్పటికీ, ఇది ఐరోపాలో అన్ని భారత అనుకూల విప్లవ కార్యకలాపాలకు మార్గదర్శక మరియు నియంత్రణ సంస్థగా కొనసాగింది. చంపక్ రామన్ పిళ్లై, తనతో చేరిన లాలా హర్దయాల్తో పాటు ఆమ్స్టర్డామ్, స్టాక్హోమ్ మరియు యూరప్లోని ఇతర ప్రదేశాలలో, అలాగే వాషింగ్టన్తో సహా అమెరికా నగరాల్లో దాని శాఖలను ఏర్పాటు చేయగలిగాడు. ఈ ద్వయం జర్మన్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఫర్ ది ఈస్ట్తో కలిసి జర్మన్ శిబిరాల్లోని భారతీయ యుద్ధ బందీల మధ్య ప్రచారాన్ని ప్రారంభించింది. భారత స్వాతంత్ర్య ఉద్యమాలను ప్రోత్సహించడానికి, చంపక్ రామన్ పిళ్లై యూరప్, ఆసియా మరియు ఆఫ్రికాలోని జర్మన్ కాలనీలలో అజ్ఞాతంలో పర్యటించాడు. చట్టో-చెంపక్ కమిటీ అని పిలవబడే దానిలో వీరేంద్రనాథ్ ఛటోపాధ్యాయతో కలిసి విప్లవ కార్యకలాపాల కోసం నిధులను సమీకరించడానికి ప్రయత్నించాడు. ఇంతలో బెర్లిన్లో, జర్మన్ జనరల్ స్టాఫ్కు అనుబంధంగా జర్మన్ విదేశాంగ కార్యాలయం ఆధ్వర్యంలో భారతీయ విప్లవ మండలి ఏర్పాటు చేయబడింది. గదర్ పార్టీ సహా అమెరికా మరియు ఐరోపాలో భారతదేశానికి చెందిన అనేకమంది విప్లవకారులు ఈ భారతీయ విప్లవ మండలిలో చేరారు. బ్రిటీష్ పాలనను ధిక్కరించే ఈ విప్లవకారులు, డిసెంబర్ 1915లో కాబూల్ కేంద్రంగా భారతదేశ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. రాజ మహేంద్ర ప్రతాప్ దాని అధ్యక్షుడిగా మరియు మౌల్వీ బర్కతుల్లా ప్రధాన మంత్రిగా, ఒబైదుల్లా సింధీ హోమ్ పోర్ట్ఫోలియోను నిర్వహిస్తూ ప్రవాస ప్రభుత్వాన్ని నిర్వహించారు. విదేశీ వ్యవహారాలు స్వయంగా చంపక్ రామన్ పిళ్లై చేపట్టారు. ఆఫ్ఘనిస్తాన్కు తీసుకువచ్చిన 20,000 మంది టర్కిష్ మరియు జర్మన్ సైనికుల ద్వారా వారు బ్రిటిష్ ఇండియాపై, వాయువ్య సరిహద్దు నుండి దాడికి ప్రణాళిక వేశారు. 1918 లో ముగిసిన ప్రపంచ యుద్ధంలో జర్మన్ ఓటమి కారణంగా ఈ ప్రణాళిక అమలవలేదు.
యుద్ధం తరువాత, చెంపకరామన్ పిళ్లై, జర్మనీలో నివసిస్తూ, సాంకేతిక నిపుణుడిగా పని చేస్తూ, తన స్వాతంత్ర్య అనుకూల ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. జర్మనీ మరియు భారతదేశం మధ్య వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి, ముఖ్యంగా స్వదేశీ వస్తువులకు విదేశీ మార్కెట్ను కనుగొనడానికి మరియు భారతదేశం యొక్క పారిశ్రామిక అభివృద్ధికి సహాయం చేయడానికి కూడా అతను ప్రయత్నించాడు. 1930లో, అతను ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ యొక్క బెర్లిన్ ప్రతినిధి అయ్యాడు. 1931లో, పిళ్లై బెర్లిన్లో మణిపూర్కు చెందిన ప్రవాస భారతీయురాలు, లక్ష్మీబాయిని కలుసుకుని వివాహం చేసుకున్నారు. 1933లో, అతను వియన్నాలో సుభాష్ చంద్రబోస్ను కలుసుకున్నాడు.
కాబూల్ నుండి విప్లవం సృష్టిద్దామనుకున్న విప్లవకారులందరూ మళ్లీ భారత గడ్డపై అడుగు పెట్టడానికి చాలా సంవత్సరాలు వేచి ఉండాల్సి వచ్చింది. చాలా మంది కమ్యూనిస్ట్ భావజలానికి లోనై, రష్యాకు వలస వెళ్లారు. వారిలో ప్రముఖ నాయకుడు ‘ఛట్టో’ చటోపాధ్యాయ, స్టాలిన్ దళాలచే ఉరితీయబడ్డాడు. పిళ్లై 20 సంవత్సరాలు జర్మనీలో నివసించారు. 1930లలో జర్మనీలో హిట్లర్ అధికారంలోకి వచ్చాడు. ప్రారంభంలో పిళ్లై హిట్లర్తో చాలా స్నేహపూర్వక సంబంధాలు కలిగి ఉన్నాడు. నిజానికి, అతను నాజీలకు మద్దతిచ్చిన నేషనల్ పీపుల్స్ పార్టీకి చెందిన ఏకైక శ్వేతజాతీయేతర సభ్యుడు. అయినప్పటికీ, అడాల్ఫ్ హిట్లర్ కూడా విన్స్టన్ చర్చిల్ వలనే జాత్యహంకారిగా మారిపోయి, భారతదేశం మరియు భారతీయుల గురించి కించపరిచే వ్యాఖ్యలు చేశాడు. కోపోద్రిక్తుడైన పిళ్లై, హిట్లర్ ప్రకటనలను ఉపసంహరించుకోవాలని మరియు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హిట్లర్ తన డిమాండ్పై చర్య తీసుకోవడానికి గడువును నిర్దేశిస్తూ, పిళ్లై ఇలా వ్రాశాడు: “మీరు రక్తం కంటే చర్మం రంగుకే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నారు. మా చర్మాలు నలుపుగా ఉండవచ్చు కానీ మా హృదయాలు కాదు” అని ముక్కుసూటిగా పేర్కొన్నారు.
హిట్లర్ 1933లో ఛాన్సలర్ అయిన తరువాత మరింత నిరంకుశంగా మారాడు. పిళ్లై యొక్క తిరుగుబాటు వైఖరికి నాజీలు,వారి లక్షణమైన దుర్మార్గపు పద్ధతిలో పగ పెంచుకున్నారు. వారు అతనికి నెమ్మదిగా విషప్రయోగం చేయడంతో, అతని ఆరోగ్యం క్షీణించింది. వారు అతని ఇంటిపై దాడి చేసి దానిని స్వాధీనం చేసుకుని, అతనిని బలవంతంగా బయటకు పంపారు. పిమ్మట, చంపక్ రామ్ పిళ్లై ఇటలీకి వెళ్లారు. అక్కడ అతని మెదడులో రక్తం గడ్డకట్టడం కనుగొనబడింది. సరైన వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమత లేకపోవడంతో 1934 మే 28న ఇటలీలోని ఓ సాధారణ నర్సింగ్ హోమ్లో తుదిశ్వాస విడిచారు. భారతదేశం కోసం తన జీవితమంతా అర్పించి, హిట్లర్ వంటి భయంకరమైన నియంతని సవాలు చేయడానికి జంకని ఈ నిరుపమాన దేశభక్తుడి జీవితం ఆ విధంగా ముగిసింది.
పిళ్లై భార్య, లక్ష్మీబాయి 1935లో తన భర్త చితాభస్మాన్ని తీసుకుని భారతదేశానికి తిరిగి వచ్చారు. భారత జెండాను ఎగురవేసే యుద్ధనౌకలో ఇంటికి వెళ్లాలనేది పిళ్లై చివరి కోరిక. బొంబాయిలో నివసిస్తూ 32 సంవత్సరాలు నిరీక్షించవలసి వచ్చినప్పటికీ లక్ష్మీబాయి ఆ కోరికను నెరవేర్చుకుంది. 1966 సెప్టెంబరు 17న, పిళ్లై అస్థికలను తీసుకుని, INS ఢిల్లీ, బొంబాయి నుండి బయలుదేరి, 19న కొచ్చిన్కు చేరుకోవడానికి బయలుదేరింది. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో త్రివేండ్రం చేరుకుని కన్యాకుమారి వరకు వెళ్లి అక్కడ పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో హిందూ మహాసముద్రంలో చంపక్ రామన్ పిళ్లై ఆస్తికలను నిమజ్జనం చేశారు. చెంపకరామన్ పిళ్లై ఎట్టకేలకు తన మాతృభూమిలో, వలసవాదపు సంకెళ్ల నుండి విముక్తి పొందాడు.
తన లక్ష్యాన్ని నెరవేర్చిన తరువాత, లక్ష్మీబాయి బొంబాయికి తిరిగి రావడానికి ముందు కొంతకాలం తన భర్త కుటుంబంతో నివసించింది. స్వాతంత్ర్యం తర్వాత, మొరార్జీ దేశాయ్ ఆమె నివసించడానికి ఒక ఫ్లాట్ను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఆమెకు ఒక ఫ్లాట్ను కేటాయించినప్పటికీ, ఆమె జీవనోపాధికి సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేయలేదు. పర్యవసానంగా, ఆ అభాగ్యురాలు 1972లో మరణించే వరకు, ఒంటరిగా కడు బీదరికంలో గడిపారు.
చెన్నైలోని అడయార్లోని గాంధీ మండపం వద్ద తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అతని విగ్రహం, ఈ స్వాతంత్ర్య సమర యోధుడు, విదేశీగడ్డ నుండి మనదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా చేసిన విప్లవాన్ని స్పురింపజేసే అసాధారణ స్మారక చిహ్నం.
More Stories
స్వామి సహజానంద
పళస్సీ రాజా కేరళ వర్మ
వేలు నాచియార్ (జన్మతిథి, జనవరి 03)